తిరుగులేని ముఖేశ్ అంబానీ... రిలయన్స్ అధినేతకు మరోసారి అగ్రస్థానం ఇచ్చిన ఫోర్బ్స్

  • భారత కుబేరుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్
  • నెంబర్ వన్ స్థానంలో ముఖేశ్ అంబానీ
  • వరుసగా 12వ ఏడాది అంబానీకి అగ్రస్థానం
భారత్ లో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ఫోర్బ్స్ మ్యాగజైన్ భారత కుబేరుల జాబితా వెలువరించింది. ఈ జాబితాలో ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలవడం వరుసగా 12వ సారి. తద్వారా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్న తీరు విశదమవుతోంది. ముఖేశ్ తర్వాత రెండోస్థానంలో అదానీ పోర్ట్స్ యజమాని గౌతమ్ అదానీ నిలిచారు. ముఖేశ్ సంపద విలువను 51.4 బిలియన్ డాలర్లుగా పేర్కొన్న ఫోర్బ్స్, రెండోస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఆస్తులను 15.7 బిలియన్ డాలర్లుగా చూపింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కిందటేడాది రెండోస్థానంలో ఉన్న విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ  ఈసారి 17వ స్థానానికి జారిపోయారు. అందుకు కారణం, ఆయన తన సంపదలో చాలాభాగం దాతృత్వ సేవలకు విరాళంగా ఇవ్వడమే. ఇక ఫోర్బ్స్ జాబితాలో అశోక్ లేలాండ్ అధినేతలు హిందూజా బ్రదర్స్ మూడో స్థానంలో, పల్లోంజీ గ్రూప్ యజమాని పల్లోంజీ మిస్త్రీ నాలుగో స్థానంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్ ఐదో స్థానంలో ఉన్నారు.
Go Back to Shorts
Mukesh Ambani
Forbes
Reliance

More Telugu News